జయకు నమ్మిన బంటు పన్నీరుసెల్వమే! ఎందుకంటే..?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడైనా తన బాధ్యతలను నిర్వర్తించలేని స్థితిలో ఉంటే.. ఆ బాధ్యతలను తన నమ్మిన బంటు, అన్నాడీఎంకే నేత, మంత్రి ఒ పన్నీరుసెల్వమ్కు అప్పగిస్తుంటారు. ఇప్పటికే ఆమె రెండు మూడు సార్లు కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించి నమ్మినబంటనే విషయాన్ని అందరికీ తెలియజెప్పారు.
ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత.. మరోసారి ఒ పన్నీరుసెల్వమ్(ఓపీఎస్)కు కీలకమైన శాఖలన్నింటినీ అప్పగించారు. కాగా. జయ ఆస్తులకు బినామీగా ఉన్నందునే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఎవరేమనుకున్నా గానీ, పన్నీరుసెల్వమ్.. జయకు నమ్మినబంటు అని మరోసారి మంగళవార రుజువు అయ్యింది. ఆర్థిక శాఖతోపాటు జయ వద్ద ఉన్న ఎనిమిది కీలక శాఖలను ఆమె మౌఖిక ఆదేశాల ద్వారా బుధవారం పన్నీరు సెల్వంకు అప్పజెప్పారు. ఈ విషయాన్ని జయ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు.
ప్రస్తుతం జయ వార్తాపత్రికలు చదువుతున్నారని.. త్వరలోనే కోలుకుంటారని ఆమె చెప్పారు. జయ పూర్తిగా స్పృహలో ఉన్నారని.. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండటంతో డాక్టర్లు తప్ప బయటవారిని ఆమె గదిలోకి అనుమతించడంలేదన్నారు.
కాగా, మంత్రి పన్నీరు సెల్వంకు మౌఖికంగా బాధ్యతలు అప్పజెప్పటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. గవర్నర్ వివరణ ఇచ్చే వరకు ఈ నిర్ణయంపై పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయని పీఎంకే నేత ఎస్. రామ్దాసు పేర్కొన్నారు.
పన్నీరుసెల్వమ్కే ఎందుకు కీలక బాధ్యతలు
పన్నీరుసెల్వమ్ను తన నమ్మినబంటుగా పేర్కొనడానికి చాలా కారణాలే ఉన్నాయి. సెల్వమ్కు ఎలాంటి ఈగో గానీ, అహంకారం గానీ ఉండదు. ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే అందుకు జయలలితను ఆయన క్షమాపణలు కోరుతారు. ఇలా చాలా సార్లే జరిగింది. తన నాయకత్వాన్ని ఎప్పుడూ సమర్థించే నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి సెల్వమ్ అని జయ నమ్ముతారు. సీఎం బాధ్యతలు అప్పగించినా కూడా ఆ కుర్చీలో కూర్చోలేదు పన్నీరు సెల్వమ్.
అసెంబ్లీలో కూడా జయలలిత కూర్చునే కూర్చీలో సీఎం పదవి చేపట్టినప్పటికీ సెల్వమ్ ఆ కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు. 2014లో సెల్వమ్.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. ఆ బాక్సుపై జయలలిత ఉండేలా చూశారు. ఎప్పుడూ కూడా జయలలిత గీసిన గీతను దాటే సాహసం చేయరు సెల్వమ్.
అంతేగాక, ఏ నిర్ణయం తీసుకున్న జయలలిత.. అనుమతి లేకుండా అమలు చేయనే చేయరు సెల్వమ్. అందుకే జయలలితకు పన్నీరు సెల్వమ్ నమ్మిన బంటు అయ్యాడు. ఈ క్రమంలోనే తన తర్వాత స్థానంలో సెల్వమ్ ఉండేలా చూసుకుంటారు జయలలిత.
జయ సంతకం చేశారా?
మంత్రి పన్నీరు సెల్వంకు కీలక బాధ్యతల అప్పగింతపై డీఎంకే కూడా సందేహాలను వ్యక్తం చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి మాట్లాడుతూ.. 'గవర్నర్కు సిఫారసు ఫైలుపై అసలు జయలలిత సంతకం చేశారా..? ఆమెను చూడటానికి వచ్చిన రాహుల్, అమిత్షా తదితరులను కూడా ఎందుకు గదిలోకి అనుమతించడంలేదు..?' అని ప్రశ్నించారు. డీఎంకే ఈ అంశంపై గతంలో కూడా సందేహాలను వ్యక్తపర్చింది. ప్రభుత్వం జయ ఆరోగ్యంపై ప్రకటన వెలువరించి.. ఫొటోలు విడుదల చేయాలని సూచించింది.
కాగా, సీఎం జయలలిత మళ్లీ విధులు చేపట్టే వరకు ఆమె శాఖల్ని పన్నీర్సెల్వం చూసుకుంటారని రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ప్రకటించారు. కేబినెట్ సమావేశాలకూ సెల్వమే నేతృత్వం వహిస్తారని రాజ్భవన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగశాసనం సెక్షన 166 (3) ప్రకారం సీఎం అధీనంలో ఉన్న శాఖలన్నీ ఆమె మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు పన్నీర్సెల్వానికి అప్పగిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
జయ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి నుంచి స్థానిక గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం కుదుటపడుతున్నప్పటికీ.. మరికొన్ని రోజులు జయ ఆసుపత్రిలో ఉండాల్సి ఉందని అపోలో ప్రకటించడంతో ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి 7న మంత్రులు పన్నీర్సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామమోహనరావులతో గవర్నర్ సమావేశమై చర్చించారు.
ఈ మేరకు తాజాగా జయ వద్ద ఉన్న హోం, ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా రెవె న్యూ అధికారుల వ్యవహారాలు, సాధారణ పరిపాలనా శాఖలను ఆర్థికమంత్రి పన్నీర్సెల్వంకు బదిలీ చేశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి అరుణ్జైట్లీ పరామర్శించారు. సుమారు 20 నిమిషాలపాటు అసుపత్రిలోనే ఉన్నా వారు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఇక జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్తో ప్రసాదం, అంగవసా్త్రన్ని పంపారు. కాగా జయ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు లండన్కు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ జాన్ రిచర్డ్ బిలే గురువారం చెన్నై రానున్నారు. మరోవైపు జయ ఆరోగ్యంపై ఫేస్బుక్, ట్విటర్లో పోస్టు చేసిన మరో 9మందిపై కేసు నమోదు చేశారు. దీంతో కేసులు నమోదైన వారి సంఖ్య 51కి చేరింది.