పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం!
శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి దూరం చేసే విషయంలో సక్సస్ అయిన పన్నీర్ సెల్వం తాజాగా రెండు కొత్త డిమాండ్లను తెరమీదకు తీసుకు వచ్చి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి పట్టపగలే చుక్కలు చూపించారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిల భారత అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే)లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గంతో రాజీకి సై అని చెప్పిన పన్నీర్ సెల్వం ఇప్పుడు మరో ఝలక్ ఇచ్చారు.
రెండు వర్గాలు రాజీ అయితే తనకు రెండు పదవులు కావాలని బుధవారం ఎడప్పాడికి పళనిసామికి ఝలక్ ఇచ్చారు. అయితే పన్నీర్ సెల్వం డిమాండ్లను ఎడప్పాడి పళనిసామి అంగీకరిస్తారా ? లేదా ? కథ మళ్లీ మొదటికే వస్తుందా ? అనే అనుమానాలు అన్నాడీఎంకే నాయకుల్లో మొదలయ్యింది.
ఆ రెండు పదవులు నాకే కావాలి
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తనకే కావాలని బుధవారం పన్నీర్ సెల్వం డిమాండ్ చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి ఉలిక్కిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ తానే బాధ్యతలు స్వీకరించాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారని స్పష్టంగా వెలుగు చూసింది.
రెండు పదవులు ఒక్కరికే అంటూ
అన్నాడీఎంకే పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండాలని, ముందు నుంచి పార్టీ సిద్దాంతం అదే అంటూ గతంలో శశికళ వర్గం వాదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శశికళ ఫ్యామిలీని పార్టీ నుంచి పూర్తిగా తప్పించాలని నిర్ణయం తీసుకోవడంతో గతంలో వారు చేసిన నినాదాన్ని ఇప్పుడు పన్నీర్ సెల్వం తెరమీదకు తీసుకువచ్చి షాక్ ఇచ్చారు.
పార్టీ చీఫ్ గా పన్నీర్ సెల్వం ఓకే
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పన్నీర్ సెల్వం ను నియమించి ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఇంత వరకు పార్టీ నాయకులు నిర్ణయించారు. అయితే బుధవారం ఉదయం పన్నీర్ సెల్వం రెండు కొత్త డిమాండ్లను తెరమీదకు తీసుకు వచ్చి ఎడప్పాడి పళనిసామికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు.
సీనియర్లు భేటీ. ఏం చెద్దాం
శశికళ ఫ్యామిలీని పార్టీ నుంచి బహిష్కరిస్తే రాజీకి సిద్దం అని చెప్పిన పన్నీర్ సెల్వం తాజాగా రెండు డిమాండ్లు చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి, సీనియర్ మంత్రులు భేటీ అయ్యి ఇప్పుడు ఏం చేస్తే మంచిది అంటూ చర్చలు మొదలు పెట్టారు
రెండు పదవులు ఆయనకే ఇస్తే ?
శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరించాలని మీడియా ముందే చెప్పిన సీనియర్ మంత్రులు ఇప్పుడు రెండు పదవులు పన్నీర్ సెల్వం చేతిలో పెడితే ఇంతకాలం ఆయన మీద బహిరంగంగా విమర్శలు చేసిన మా పదువులు ఉంటాయా ? ఊడిపోతాయా ? అని అర్థం కాక సీనియర్ మంత్రులు ఆయోమయంలో పడిపోయారు.
ఒక్క పదవికి అంగీకరిస్తే ఓకే
పన్నీర్ సెల్వంను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకునేలా ఆయన్ను ఒప్పించాలని ఎడప్పాడి పళనిసామి వర్గం పావులుకదుపుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు ఈ విషయంపై మరోసారి పన్నీర్ సెల్వం వర్గంతో మళ్లీ చర్చలు మొదలుపెట్టారు.
పట్టుబిగిస్తున్న పన్నీర్ సెల్వం
శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి దూరం చేసే విషయంలో విజయం సాధించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు పార్టీలోని ఎమ్మెల్యేలను తన వర్గం వైపు తిప్పుకునేలా పావులుకదువుతున్నారు. మెజరిటీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కావాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని సమాచారం. మొత్తం మీద బుధవారం పన్నీర్ సెల్వం రెండు కొత్త డిమాండ్లు తెరమీదకు తీసుకు వచ్చి ఎడప్పాడి పళనిసామికి పట్టపగలే చుక్కలు చూపించారు.