24గంటల్లో రెండోసారి.. శశికళతో పన్నీర్ సెల్వం భేటీ.. ఏం చర్చించారు?
చెన్నై: ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మరోసారి శశికళతో భేటీ అయ్యారు. గడిచిన 24గంటల్లో శశికళతో ఆయన రెండోసారి భేటీ కావడం గమనార్హం. సీఎంగా తన అధికారిక కార్యక్రమాలు మొదలుపెట్టబోయే ముందు శశికళతో ఆయన భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలువురు సీనియర్ మంత్రులతో కలిసి చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో శశికళతో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు.
అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారని, లేదు.. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజవర్గం నుంచి పోటీ చేసి.. సీఎం కావాలన్న యోచనలో శశికళ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ వరుస భేటీలు ప్రతీ ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కాగా, శుక్రవారం నాడు శశికళ-పన్నీర్ సెల్వం మధ్య దాదాపు రెండు గంటల పాటుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అన్నాడీఎంకె జనరల్ కౌన్సిల్ కీలక సమావేశ తేదీని ఖరారు చేసే విషయంతో పాటు వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని ఘనంగా నిర్వహించాలనే విషయమై భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం.
మొత్తానికి తాజా పరిస్థితులను గమనిస్తే.. అమ్మ మరణం తర్వాత కూడా పోయెస్ గార్డెన్ కేంద్రంగానే తమిళ రాజకీయాలు కీలక మలుపు తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతోంది. దాదాపు 40ఏళ్ల పాటు జయలలిత ఇదే పోయెస్ గార్డెన్ నుంచే తమిళ రాజకీయాలను శాసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగుతున్నప్పటికీ.. శశికళ చేతిలో ఆయనో రిమోట్ కంట్రోల్ లాంటి వాడేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి ఈ వరుస భేటీల వెనుక అసలు మర్మమేంటో తెలియరానప్పటికీ.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి శశికళ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.