యూపీ అసెంబ్లీలో గందరగోళం: గవర్నర్ పైకి పేపర్స్ విసిరిన విపక్షాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల తొలిరోజున విపక్షాలు వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ మండిపడుతోంది. సభలో విపక్ష ఎమ్మెల్యేల తీరును బీజేపీ ప్రభుత్వం తప్పుపట్టింది. సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు ఆయన పైకి పేపర్స్ ను విసిరేశాయి.
ప్లకార్డులు, అరుపులతో తమ నిరసన తెలియజేశాయి. గవర్నర్ మీదకు పేపర్స్ విసిరేసిన సమయంలో.. సెక్యూరిటీ ఆయనకు రక్షణకు కల్పించారు. ఫైల్స్, బుక్స్ తో విపక్ష సభ్యులు విసిరిన పేపర్స్ ను తిప్పి కొట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. యూపీలో శాంతి భద్రతలు సరిగా లేవని కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు ఆరోపించాయి.
విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలో సీఎం యోగి సభలోనే ఉన్నారు. మంత్రి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. సభలో ప్రతిపక్షాల తరు అవమానకరంగా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈలలు వేశారని అన్నారు. సోషలిస్ట్ సిద్దాంతకర్త రామ్ మనోహర్ లోహియా బతికి ఉంటే.. సోమవారం యూపీలో అసెంబ్లీలో విపక్షాలు ప్రవర్తించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకునేవారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు సభలో గందరగోళం రేపుతున్నాయని శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. విపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం ఎంతమాత్రం తలొగ్గబోదని స్పష్టం చేశారు.