షాకింగ్: రేప్ చేసిన 'పెద్ద వయస్కుడి'తో పెళ్లి చేసిన పేరెంట్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ పదకొండేళ్ల బాలిక పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మైనర్ అయిన ఆ బాధితురాలిని తల్లిదండ్రులు బలవంతం చేశారు. పెళ్లి కూడా చేశారు.
ఆ బాలిక కంటే నిందితుడు వయస్సులో చాలా పెద్దవాడు. ఉత్తర ప్రదేశ్లోని బులంద్ షహర్లో ఈ సంఘటన వెలుగు చూసింది. రెండు నెలల క్రితం 28 ఏళ్ల వ్యక్తి ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది.
దీంతో బాధితురాలి తల్లిదండ్రులు నిందితుడి వద్దకు వెళ్లి తమ కూతురును పెళ్లి చేసుకోమని కోరారు. స్థానికంగా ఉండే కొందరు.. వారికి ఈ సూచన చేసినట్లుగా తెలుస్తోంది. అత్యాచారం చేసిన వ్యక్తితోనే మీ కూతురుకు పెళ్లి చేయాలని పలువురు సూచించారు.
దీంతో, ఆ తల్లితండ్రులు కూతురుని బలవంతం చేశారని తెలుస్తోంది. దీంతో, నెల రోజుల క్రితం పెళ్లి కూడా చేశారు. పెళ్లి చేసే సమయానికి ఆమె నెల రోజుల గర్భవతి. ఈ విషయం తెలిసిన కొందరు సోషల్ యాక్టివిస్ట్స్ వెళ్లి ప్రశ్నించగా.. తమ కూతురు అతనిని ప్రేమించిందని, అందుకే అతనితో పెళ్లి చేశామని చెప్పారని తెలుస్తోంది.