నేపాల్ భూకంపం: చెక్కు చెదరని పశుపతినాథ్ ఆలయం
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్ భూకంపంలో ఎన్నో కట్టడాలు నేలమట్టమైనా చారిత్రక పశుపతినాథ్ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. నేపాల్లో భూకంపానికి స్మారక స్తంభాలు, ప్రాచీన దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. కానీ మూడో దశాబ్దానికి చెందిన పశుపతినాథ్ ఆలయానికి ఎలాంటి ముప్పు కలగలేదు.
7.9 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు ఖాట్మాండులో ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పశుపతినాథ్ ఆలయానికి వెలుపల గోడలు కొంచెం బీటలు వారాయి. అంతకుమించి చెక్కుచెదరలేదని స్థానికులు చెబుతున్నారు.
ఎప్పటిలాగే ఆదివారం సైతం ఈ ఆలయంలో శివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు వరుస కట్టారు. చుట్టుపక్కల వర్తకులు సైతం భక్తుల కోసం దుకాణాలు తెరిచారు. ఈ ఆలయం, కేదర్ నాథ్ ఆలయం ఒకేసారి నిర్మించారని నిపుణులు చెబుతున్నారు. దేవుడి మహిమ వల్లే ఎలాంటి ముప్పు వాటిల్లలేదని భక్తులు చెబుతున్నారు.
నామరూపాల్లేని ఆలయాలు, చారిత్రక కట్టడాలు
నేపాల్ను శనివారం తీవ్రస్థాయిలో కుదిపేసిన పెను భూకంపంతో పాటు తదనంతరం సంభవించిన ప్రకంపనల ధాటికి ఖాట్మండు, ఆ పరిసర ప్రాంతాల్లోని పలు హిందూ దేవాలయాలు పూర్తిగా ధ్వంసమవగా, మరికొన్ని దేవాలయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రఖ్యాత కాస్తమండపం, పంచతాల్ గుడి, తొమ్మిది అంతస్తుల బసంత్పూర్ దర్బార్, దశావతార దేవాలయం, కృష్ణ మందిరం సహా పలు దేవాలయాలు ఈ భూకంపం ధాటికి పూర్తిగా కుప్పకూలిపోయాయి. 16వ శతాబ్దంలో పూర్తిగా చెక్కతో నిర్మించిన కాస్తమండపాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేపాల్ రాజధానికి ఖాట్మండుగా నామకరణం చేశారు.
ఏడు దేవాలయాలకు తీవ్ర నష్టం జరిగింది. ఖాట్మాండు లోయలో, సమీప ప్రాంతాల్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాష్టమండప్, తపంచ్ తలే, దేవావతార్ ఆలయాలు, కృష్ణమందిర్ వంటివి ఉన్నాయి. తొమ్మిది అంతస్తుల భీంసేన్ (ధరహార) స్థూపం కుప్పకూలింది. బౌద్ధస్థూపాలైన పటాన్, భక్తాపూర్లు దెబ్బతిన్నాయి.
క్షేమంగా భారత బాలికల ఫుట్బాల్ జట్టు
భారత బాలికల ఫుట్బాల్ జట్టు ఖాట్మాండు నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. తెలంగాణ యువ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య (నిజామాబాద్) నేపాల్ భూకంప విలయం నుంచి సురక్షితంగా బయటపడింది. ఏఎఫ్సీ ఆసియా అండర్-14 బాలికల రీజనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు భారత బాలికల జట్టు ఖాట్మాండు వెళ్ళింది.
షెడ్యూల్ ప్రకారం భారత ఫుట్బాల్ జట్టు శనివారం ఇరాన్తో మూడో స్థానం కోసం వర్గీకరణ మ్యాచ్ ఆడాలి. ఐతే మ్యాచ్ ఆరంభానికి ముందే భూకంపంతో అతలాకుతలమైంది. ఆ సమయంలో భారత ఫుట్బాల్ జట్టు మైదానంలో ఉంది. మ్యాచ్ నేపథ్యంలో సాధన చేసేందుకు ఉదమయే జట్టంతా హోటల్ నుంచి మైదానానికి రావడంతో క్రీడాకారిణులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో క్రీడాకారిణులు రాత్రి హోటల్ వెలుపలే నిద్రించారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవ తీసుకుని క్రీడాకారిణులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో భారత జట్టు ఢిల్లీ చేరుకుంది. 13 ఏళ్ళ సౌమ్య సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు.