అమిత్ షాపై ఉగ్రవాదుల గురి: పాట్నాలో దాడికి కుట్ర?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలోని బహదూర్పూర్లో ఓ ప్లాట్లో సోమవారం రాత్రి బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తులో దిగ్ర్భాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. అమిత్ షాను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు తేలింది.
వచ్చే ఏడాది బీహార్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పాట్నాలోని గాంధీ మైదానంలో ఏప్రిల్ 14న అమిత్ షా ర్యాలీని నిర్వహించనున్నారు. అయితే సోమవారం బహదూర్పూర్లోని హౌజింగ్ కాలనీలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. మరో రెండు శక్తివంతమైన బాంబులను పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్వీర్యం చేశారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలానికి పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకుని నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. 2013లో నరేంద్ర మోడీ.. గాంధీ మైదానంలో ప్రచారం నిర్వహించిన సమయంలో, బోధ్ గయాలో పేలిన బాంబులతో ఈ బాంబులకు పోలిక ఉన్నాయని, అదే మెటీరియల్ ఈ బాంబులలో ఉపయోగించారని పోలీసులు తెలిపారు.
కాగా, ఘటనా స్థలంలో లభించిన రెండు బాంబులను నిర్వీర్యం చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి జితేంద్ర రాణా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. బాంబు పేలుడు ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బాంబు పేలిన ఫ్లాట్లో నలందాకు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు వస్తున్నారని తెలియడంతోనే వారు పరారయ్యరని తెలిపారు.
కాగా, ఆ ఇద్దరు యువకులనే బాంబులను తయారు చేసి వుంటారని, బాంబు పేలుడు సంభవించడంతో అక్కడ్నుంచి పారిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ బాంబులకు టైమర్ డివైజ్ కూడా అమర్చబడి ఉందని పోలీసులు తెలిపారు. ఆ టైమర్ డివైజ్ కూడా 2013లో నరేంద్ర మోడీ నిర్వహించిన గాంధీ మైదానంలో, బోధ్గయాలో పేలిన పేలుడు పదార్థాలకు అమర్చిన దానిలానే ఉందని చెప్పారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ బృందం మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి సమాచారం సేకరించింది. ఎన్ఐఏ కూడా ఈ బాంబు ఘటనలో దర్యాప్తు జరుపుతోంది.