మాకు అడ్డొస్తే అంతే!.. పేటీఎం సీఈవో స్పీచ్ వైరల్(వీడియో)
ఉద్యోగుల కోసం ఇచ్చిన ప్రత్యేక పార్టీలో పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ చేసిన ప్రసంగం యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయింది.
న్యూఢిల్లీ: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ చేసిన ఓ ప్రసంగం వైరల్ గా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు అనివార్యం కావడంతో.. చాలామంది పేటీఎం లాంటి యాప్స్ వైపు మళ్లుతోన్న సంగతి తెలిసిందే.
చిన్న చిన్న దుకాణాలు, సెలూన్స్.. ఇలా ప్రతీ చోట పేటీఎం వినియోగం పెరిగిపోవడంతో ఆ కంపెనీకి లాభాలు పోటెత్తాయి. దీంతో కంపెనీ యాజమాన్యం సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు ఇచ్చింది. ఆ సమయంలో కంపెనీ సక్సెస్ గురించి విజయ్ శేఖర్ వర్మ ప్రసంగించారు.
అయితే ఇదే ప్రసంగంలో విజయ్ శేఖర్ శర్మ నోరు జారారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తమ కంపెనీ దారికి ఎవరు అడ్డొచ్చినా.. పక్కకు తప్పుకోవాల్సిందేనని, లేనిపక్షంలో చచ్చిపోతారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ సంస్థ సైకిలో, ఆటోనో కాదని, ఏకంగా యుద్దట్యాంకర్ అని చెప్పుకొచ్చారు.
తమ కంపెనీకి సాధ్యం కాదు అనేదేది లేదని, అడ్డొచ్చిన వాటిని పచ్చడి చేసుకుంటూ ముందుకెళ్లడమే తమ పని అని గట్టిగా అరుస్తూ చెప్పారు. చరిత్రలో తమ సంస్థ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ శేఖర్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలన్ని వీడియో రూపంలో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.