ఆప్ది వెన్నుపోటు: మోడీ, బేడీకి ఢిల్లీ గురించి బాగా తెలుసని..
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ రాష్ట్రంలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పు ఢిల్లీలో విశ్వాస్నగర్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడారు. ఢిల్లీ గురించి బిజెపి సిఎం అభ్యర్థి కిరణ్ బేడీకి బాగా తెలుసని అన్నారు. ఆమెను గెలిపిస్తే ఢిల్లీని ప్రగతి పథంవైపు నడిపిస్తారని చెప్పారు.
జనం సమస్యల పరిష్కారమే బిజెపి ధ్యేయమని అన్నారు. నిరుడు ఢిల్లీ ప్రజలు ఓటు వేసిన వాళ్లు ఢిల్లీని వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. ఢిల్లీ ప్రజల ఆశలు, కలలన్నింటీనీ ఆమ్ ఆద్మీ పార్టీ అడియాశలు చేసిందని దుయ్యబట్టారు.
ఎవరైనా సరే ప్రజలను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలరని పదేపదే చేయలేరని తెలిపారు. ఈసారి కిరణ్బేడీని ఎన్నికల్లో గెలిపిస్తే ఢిల్లీని ఉన్నతస్థానానికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఢిల్లీకి ఏ పార్టీ బాగా సేవ చేయగలదో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఈసారి ఢిల్లీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేస్తారని తెలిపారు.
2022 వరకు ఢిల్లీలో ప్రతీ కుటుంబానికి స్వంత ఇళ్లు ఉండాలనేది బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఆ పార్టీవి అన్ని డాంబికాలేనని, బాధ్యత నుంచి పారిపోయే పార్టీ అని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే ప్రచార సభల్లో కూడా నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.