టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో మోడీ
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగైజన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ను ఎన్నుకునే పోల్ వచ్చేసింది. ప్రతి ఏటా ఈ మ్యాగజైన్ ప్రకటించే 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరారు. 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ మొదటి స్ధానంలో కొనసాగుతుండగా.. రెండవ స్ధానంలో మోడీ ఉన్నారు.
ప్రతి ఏడాది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులతో 50 మందిని ఎంపిక చేసి ఒకరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ ప్రకటిస్తుంది. గతంలో 'వివాదాస్పద ప్రాంతీయ నేత'గా మోడీ ఉన్నారనీ ఈ సందర్భంగా మోడీ గురించి టైమ్ పేర్కొంది.
ఇటీవలి ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో భారతీయ జనతా పార్టీకి చరిత్రాత్మక విజయాన్ని సాధించిపెట్టి ప్రధాని పదవిని అధిరోహించారని చెప్పింది. ఇప్పటివరకు ఈ రేసులో నరేంద్రమోడీకి 3.8% ఓట్లు వచ్చాయి.
రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్ధానంలో ఉండగా.. రెండవ స్ధానంలో మోడీ.. మూడవ స్ధానంలో పోప్ ఫ్రాన్సెస్ ఉన్నారు. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొందిన పాకిస్ధాన్ బాలిక మాలాలా నాల్గవ స్ధానంలో కొనసాగుతుండగా.. ఐదవ స్ధానంలో ఎబోలా వైద్యులు-నర్సులు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ ముందంజలో ఉన్నారు. హిల్లరీ క్లింటన్, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ తర్వాత స్ధానాల్లో ఉన్నారు.
టైమ్ మ్యాగజైన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోల్ వోటింగ్ సెప్టెంబర్ 6వ తేదీ 11:59 PMకు ముగుస్తుంది. డిసెంబర్ 10వ తేదీన టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ను ప్రకటిస్తుంది. అదే రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కావడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రధాని నరేంద్రమోడీకి వోట్ వేసి టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'కు ఎంపికయ్యేలా చేయండి.