సిద్ధరామయ్యకు 'రిస్ట్వాచ్' తలనొప్పి: లోకయుక్తాలో పిటిషన్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకయుక్తాలో పిటిషన్ దాఖలైంది. సీఎం సిద్ధరామయ్య ధరించే ఖరీదైన 'హ్యూబ్లోట్' వాచ్ను తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్ను దాఖలు చేశారంటూ మానవ హక్కలు రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకయుక్తాలో పిటిషన్ దాఖలు చేశారు.
సిద్ధరామయ్య ధరించిన ఈ వాచ్ ఖరీదు సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంటుంది. సీఎం సిద్ధరామయ్య ధరించిన ఈ ఖరీదైన వాచ్కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా రామమూర్తి గౌడ లోకయుక్తాను తన పిటిషన్లో కోరారు.
ఈ వాచ్కు సంబంధించిన వివరాలను 2015 మార్చి 31లో లోకయుక్తాకు అందజేసిన నివేదికలో పొందుపరచలేదు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ వస్తువు కొనుగోలు చేసినా లేదా ఆయనకు బహుమతిగా లభించినా అందుకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది.
అయితే ఈ వాచ్కు సంబంధించి వివరాలను సిద్ధరామయ్య పొందుపరచలేదు. లోకయుక్తాకు సిద్ధరామయ్య అందజేసిన వివరాల ప్రకారం సిద్ధరామయ్యకు వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 2లక్షల వరకు ఆదాయం వస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు ఇచ్చిన భవంతుల అద్దె రూపంలో ఏడాదికి రూ. 38 లక్షల ఆదాయం వస్తోంది.
తన భార్య పార్వతి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు ఏడాదికి రూ. .25 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నివేదిక సమర్పించే నాటికి సీఎం సిద్ధరామయ్య తన ఇద్దరు కుమారులతో పాటు ఉమ్మడిగా ఉన్న వ్యవసాయ భూమి ద్వారా ప్రతి ఏడా రూ. 25 లక్షల ఆదాయం వస్తుంది.