'బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద ఇయర్-2013' అవార్డుకు ఎంపికైన సచిన్ చివరిసారి క్రీజు ఫోటో
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సచిన్ టెండూల్కర్ వాంఖడె స్టేడియంలో ఆడిన టెస్టు మ్యాచ్ తన కెరీర్లో చివరది.
ఆరోజు మ్యాచ్ ఆడేందుకు సచిన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చేతులకు గ్లోవ్స్ తొడుక్కుంటూ బయటకు వస్తుండగా... మరోవైపు అభిమానులు తమ ఫోన్ కెమెరాల్లో తమ అభిమాన క్రికెట్ దేవుణ్ని బంధించేందుకు పోటీ పడ్డారు.
ఆ దృశ్యాన్ని ఓ ఫోటోగ్రాఫర్ అధ్బుతంగా తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడా ఆ ఫోటోనే 'బెస్ట్ పిక్చర్ ఆఫ్ ద ఇయర్-2013' అవార్డుకు ఎంపికైంది. ఆ ఫోటోను ముంబైకి చెందిన 41ఏళ్ల 'మిడ్ డే' ఫోటో జర్నలిస్ట్ అతుల్ కాంబ్లే తీశాడు. 'ఎంఎఫ్ఐ-యస్ బ్యాంక్ నేషనల్ ప్రెస్ ఫోటో కాంటెస్ట్' ప్రతిష్టాత్మకంగా నాల్గవసారి నిర్వహించిన పోటీల్లో ఈ ఫోటో అవార్డుని దక్కించుకుంది.
ఈ కాంటెస్ట్కి దేశవ్యాప్తంగా 240కి పైగా ఫోటో జర్నలిస్టులు తమ ఫోటోలను పంపారు. 8000 వరకు వచ్చిన ఫోటోల్లో సచిన్ టెండూల్కర్ ఫోటోనే ఏకగ్రీవంగా కమిటీ ఎంపిక చేసింది. వచ్చే నెలలో నిర్వహించనున్న అవార్డుల కార్యక్రమంలో విజేత జర్నలిస్టుకు రూ.75వేల నగదు బహుమతి ఇవ్వనున్నారు.