కన్నయ్య తల నరికేస్తాం: బస్సులో తుపాకీ, లేఖ
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ బస్సులో తుపాకీ కనిపించడం ఢిల్లీలో కలకలం రేపింది. కాశ్మీర్ గేట్ నుంచి జేఎన్యూ క్యాంపస్ మధ్య నడిచే ఓ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును గుర్తించిన డ్రైవర్.. పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగును తనిఖీ చేయగా.. అందులో ఓ తుపాకీ, బెదిరింపు లేఖ ఉన్నట్లు గుర్తించారు. రాజద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మరో విద్యార్థి ఉమర్ ఖలీద్ తలలు నరికేస్తానంటూ ఆ లేఖలో బెదిరించారు.
ఈ నేపథ్యంలో బ్యాగు వివరాలను సేకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని విచారించినట్లు తెలిపారు. గతంలో కన్నయ్యకుమార్ను ఫేస్బుక్ ద్వారా బెదిరించిన వ్యక్తే ఈ లేఖ కూడా రాసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కన్నయ్య, ఉమర్లను బెదిరిస్తూ.. ఇటీవల ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
ఇప్పటికే తమ మనుషులు జేఎన్యూ క్యాంపస్లో ఉన్నారని.. ఏ క్షణంలోనైనా వారిని చంపేస్తారని ఆ వ్యక్తి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జేఎన్యూ క్యాంపస్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా మరోసారి బెదిరింపు లేఖ రావడంతో కన్నయ్య కుమార్, ఉమర్ల భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.