ఒబామాను పేరుపెట్టి పిలిచిన మోడీ: తప్పుపట్టిన డిగ్గీ, జైరాం ఆగ్రహం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని నరేంద్ర మోడీ 'బరాక్' అంటూ పేరు పెట్టి పిలవడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పు పట్టారు. హెట్ ఆఫ్ ది స్టేట్ను అలా పిలవడం సరికాదని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, పౌర అణు ఒప్పందంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని దిగ్విజయ్ మంగళవారం మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం పౌర అణు ఒప్పందం బిల్లు తీసుకొచ్చిందని చెప్పారు.
యూపీఏ బిల్లుకు వ్యతిరేకత తెలిపిన బీజేపీ అధికారంలోకి వచ్చాక దాని పైన యూటర్న్ తీసుకుందన్నారు. బీజేపీ సలహాలు, సవరణలను సబ్క్లాజ్ పేరుతో జొప్పించారన్నారు. యూపీఏ ఒప్పందంలో ఏ సవరణలు చేసిందీ బీజేపీ స్పష్టం చేయడం లేదన్నారు.
పౌర అణు ఒప్పందానికి సంబంధించి భారత్-అమెరికాల మధ్య ఏం జరిగిందో తెలియాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన అవగాహన పారదర్శకంగా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే సబ్క్లాజ్ ద్వారా దేశ సార్వభౌమాధికారం, ప్రయోజనాలను బీజేపీ ఫణంగా పెట్టినట్టుగా కనిపిస్తోందన్నారు.
జైరామ్ మండిపాటు
ఒబామాతో మాట్లాడేటప్పుడు మోడీ తన పేరుతో ఉన్న సూటు ధరించడంపై జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం మోడీ ఉన్మాదాన్ని తెలుపుతోందన్నారు. ఇది మతిస్థిమితం లేని చర్యగా అభివర్ణించారు.