'బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సిందే'
నవంబర్8 నుంచి డిసెంబర్ 31వ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు ప్రధాని మోడీ.
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తమ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 8వ తేదీ.. అంటే నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి డిసెంబర్ 31వ వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయంపై విపక్షాల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో.. పారదర్శకంగా వ్యవహరించేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలకు నోట్ల రద్దు గురించి ముందే తెలుసునన్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు మరియు సొంత పార్టీ నేతల విషయంలోను కఠినంగా వ్యవహరిస్తున్నామనే సంకేతాలు పంపిచడానికే మోడీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.