లక్షకోట్లు తిన్నదెవరు, నా లెక్కచెప్తా: నితీష్-మోడీ ఫైట్
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మధ్య మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. తమ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త హామీలు ఇవ్వవలసిన అవసరం లేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి నెరవేరిస్తే చాలు అని నితీష్ వ్యాఖ్యానించారు.
నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగల్పూర్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొత్త హామీలు అవసరం లేదని, బీహార్కు నైతిక ధైర్యాన్ని ఇస్తే చాలన్నారు. 2014 హామీ మేరకు నేర చరిత్ర గల వారికి బిజెపి సీట్లు ఇవ్వొద్దన్నారు.
భాగల్పూర్ సభలో ప్రధాని మోడీ
భాగల్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాభివృద్ధి కోసం రూ.3.76 లక్షల కోట్లు ఇచ్చిందని, వాటిలో రూ.2.70 లక్షల కోట్లకు మాత్రమే లెక్కలున్నాయని, మిగతా రూ.1.06 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఎవరు మేశారు? చెప్పాలని నితీష్ కుమార్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
భాగల్పూర్ నుంచి నేను సవాల్ విసురుతున్నానని, తన పదవీకాలం ముగిసేలోగా ఐదేళ్లలో ఏయే పనికి ఎంతెంత ఖర్చు చేశామో పైసా సహా లెక్క చూపుతామని, అదే పనిని ప్రస్తుత బీహార్ ప్రభుత్వం చెయ్యగలదా అని సవాల్ చేశారు.
కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద మొత్తానికి ఇక్కడి పాలకులు లెక్కలు చూపడం లేదన్నారు. అంటే దీని అర్థం ఏమిటని, ఆ డబ్బు ఎవరు మేశారన్నారు. ఇప్పటి వరకు విదేశాల్లో లేదా ఎన్డీయే నిర్వహించే సభల్లో మోడీ మోడీ నినాదాలు విన్నానని, ఇప్పుడు బీహార్ అంతటా వినిపిస్తోందన్నారు.
దీనిని బట్టి ఎన్నికల్లో బిజెపిదే విజయం అని అర్థమవుతోందన్నారు. పాతికేళ్ల తర్వాత బీహారీలు తొలిసారి అభివృద్ధికి ఓటు వేయబోతున్నారని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేత జయప్రకాశ్ నారాయణ్ మృతికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు బీహార్లో కుల, మత, రాజకీయాలను ప్రోత్సహించాయన్నారు. బీహారీలకు గుండా రాజ్ల నుంచి విముక్తి కలగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన అనేది ఉండాలన్నారు.