సూట్కేసుల కంటే సూట్-బూట్ బెటరే, ఆమోదిస్తారు: కాంగ్రెస్ను ఏకేసిన మోడీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్లపాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు.
తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్ కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు. సూటుకేసుల కంటే సూట్ బూటు సర్కారునే ప్రజలు ఆమోదిస్తారని అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ తరచూ సూట్ బూట్ సర్కారు అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ ఘాటుగా స్పందించారు.
నిజంగా మీరు పేదల పక్షమే అయితే.. దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. సొంత మనుషులకు గనులు కట్టబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి.. తనను ప్రశ్నించే అర్హత లేదని ఆయన తేల్చి చెప్పారు.
60ఏళ్లల్లో గుర్తుకురాని పేద ప్రజలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నారో కాంగ్రెస్ చెప్పాలని ఎద్దేవా చేశారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. భూసేకరణ బిల్లుపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు.