జన్ధన్ యోజన: మోడీ బాటలో అమెరికా, రష్యా, స్పెయిన్
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే మోడీ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రపంచ దేశాలతోపాటు ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై అమెరికా, రష్యా, స్పెయిన్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఆ దేశాల్లో జన్ధన్ తరహాలో పథకాలు అమలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సంస్థ ‘ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' ప్రస్తుతం జన్ధన్పై ప్రభుత్వం అందజేసిన నివేదికను ఆమోదించినట్లు తెలిసింది. జన్ధన్ యోజన లక్ష్యాలు, అనతి కాలంలోనే ఈ పథకం దిగ్విజయమైన తీరు, నో యువర్ కస్టమర్ తరహా వ్యవస్థలపై భారత ప్రభుత్వం ఆ సంస్థకు నివేదిక అందించింది.
సదరు నివేదికను అధ్యయనం చేసిన ఆ సంస్థ పథకం విజయవంతమైన తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండాలన్న యోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
నిర్ణీత గడువు కంటే ముందుగానే ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది. గత ఆగస్టులో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేవలం కొద్ది నెల్లోనే 12.56 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. కాగా, తమ దేశాల ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉన్న మెజారిటీ మంది ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా యోచిస్తున్న ప్రపంచ దేశాలకు జన్ధన్ యోజన ఉపకరిస్తుందని ‘ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' పేర్కొంటోంది.