షరీఫ్తో మోడీ భేటీ: 'ప్రకృతిని తల్లిలా ఆరాధిస్తారు'
పారిస్: వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. సోమవారం పారిస్లో జరిగిన COP21 సదస్సులో పాల్గొన్న ఆయన భారత్ పెవిలియన్ను ప్రారంభించి అనంతరం మాట్లాడారు.
వాతావరణ మార్పులు ప్రపంచానికి పెనుముప్పుగా మారాయన్నారు. వాతావరణ మార్పుల అంశం ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. భవిష్యత్ను మార్చుకునేందుకు 196 దేశాలు కలిసి వచ్చాయన్నారు. సాంకేతికత సహా వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వాతావరణాన్ని ఎలా కాపాడాలో వేదాల్లో ఉందన్నారు. ప్రకృతి లేకుండా మనిషి లేడని భారత సమాజం దాన్నే నమ్ముతుందన్నారు. వేదాలు, బుద్ధిజంలోని అంశాలతో భూతాపాన్ని తగ్గించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్లో ప్రకృతిని తల్లిగా భావించి పూజిస్తారన్నారు. ప్రకృతి అవసరాలను తీర్చగలదు కానీ, మానవుని దురాశను తీర్చలేదని మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగానే భారత్లో సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
సౌర విద్యుత్తుని సైతం ప్రోత్సహిస్తున్నామన్నారు. సౌరవిద్యుత్ భారత్ భవిష్యత్ అవసరాలము తీరుస్తుందన్నారు. చెత్తాచెదారంతో ఇంధనం తయారు చేసే దిశగా భారత్ ఎదుగుతోందన్నారు. పెట్రోలియం సబ్సిడీని సైతం తగ్గించామన్నారు.
వాతావరణ మార్పులను సమిష్టిగా ఎదుర్కొవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. సోమవారం పారిస్లో జరిగిన COP21 సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ఏడేళ్లుగా ఎన్నో వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామని రెండు వారాల పాటు జరగనున్న ఈ సదస్సు సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పారిస్లో చేతులు కలిపిన భారత్, పాక్ ప్రధానులు
సోమవారం పారిస్లో వాతావరణ సదస్సుకు హాజరైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి ముఖాల్లో వెలుగులు విరబూశాయి. అంతక ముందు ప్రధాని మోడీని ఫ్రాన్స్ ప్రధాని హోలెండ్ వాతవరణ సదస్సుకి ఆహ్వానించారు.