గుండెలో రంధ్రం: నన్ను బ్రతికించండంటూ 8 ఏళ్ల ముస్లిం బాలిక మోడీకి లేఖ
న్యూఢిల్లీ: ఆగ్రాలోని మంటోలా ప్రాంతం. మోహద్ ఖలీద్ కుమార్తె తయ్యాబాకు ఎనిమిదేళ్లు. అన్వారి నీలోఫర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటుంది. తయ్యాబా తండ్రి ఆగ్రాలోని చెప్పుల ప్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవలే తయ్యాబాకు తనకు గుండెలో రంధ్రం ఉందని తెలిసింది.
ఢిల్లీ ఆసుపత్రిలోని డాక్టర్లు తయ్యాబాకు ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవుతుందని చెప్పడంతో ఆమె తండ్రికి ఏమి చేయాలో పాలుపోలేదు. రోజు రోజుకీ పాప ఆరోగ్యం క్షీణస్తుండటంతో ఆగ్రాకి చెందిన డాక్టర్ ఎస్కే కాల్రా వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు.
పాప తండ్రి ఆర్ధిక స్ధితిని తెలుసుకున్న ఆయన ప్రధానికి లెటర్ రాయాల్సిందిగా సూచించాడు. డాక్టర్ ఎస్కే కాల్రా చెప్పిన మాటల స్పూర్తితో ఆ చిట్టి తల్లి వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రధాని నరేంద్రమోడీకి లెటర్ రాసింది.
గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖలో 'నా హృదయానికి రంద్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టీవీ ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని' అని పేర్కొంది.
చిన్నారి తయ్యాబా రాసిన లేఖకు వెంటనే పీఎంఓ వెంటనే స్పందించడం విశేషం. అంతేకాదు పాప ఆపరేషన్ కోసం ఢిల్లీలోని జేపీ పంత్ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేసింది. తన లెటర్ పంపిన కొద్ది రోజులకే ప్రధాని నుంచి బదులు వచ్చిందని, ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పింది.