అది మీకెందుకు: మీడియాపై మోడీ, బజరంగ్దళ్పై షా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రఘురాం రాజన్ను తిరిగి నియమించాలా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
దీనిపై మీడియాకు అంతగా ఆసక్తి అనవసరమని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకు పదవీ కాలం ఉందని చెప్పారు. ఈ లోగా ఏదో చేద్దామన్నారు.
రఘురాం రాజన్ను వెంటనే తొలగించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోడీకి రెండు లేఖలు రాసిన విషయం తెలిసిందే. రాజన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది పరిపాలనా సంబంధమైన అంశమని, మీడియాకు అంతగా ఆసక్తి అవసరం లేదని తేల్చి చెప్పారు.
బజరంగ్ దళ్ బీజేపీ కాదు: అమిత్ షా
బజరంగ్ దళ్ బీజేపీ కాదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. రామ మందిరం తదితర అంశాలపై బజరంగ్ దళ్ నేతలు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా ఉత్తర ప్రదేశ్లో స్పందించారు.
యూపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పారు. కేంద్రం అభివృద్ధి పథకాలతో ప్రజల తీర్పు కోరుతామన్నారు. రామమందిరం విషయంలో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ సంస్థల కార్యక్రమాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్రం మాటనే ప్రజలు వినాలన్నారు.
ఏకాభిప్రాయం లేదా న్యాయ నిర్ణయం ప్రకారం రామ మందిరం నిర్మిస్తామన్నారు. బజరంగ్ దళ్ ప్రయివేటు సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమిత్ షా స్పందించారు. ఈ విషయం యూపీ ప్రభుత్వం దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందన్నారు. రాముడు నిర్ణయిస్తే, ప్రజలు కూడా తమ నిర్ణయాన్ని తెలుపుతారన్నారు.