కేజ్రీవాల్కు దొరకని మోడీ పాయింట్మెంట్: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగవారం వెల్లడించింది. గత 10 రోజులుగా ప్రధాని అపాయింట్మెంట్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆయన బిజీగా ఉన్నారని, కలవడానికి కుదరదని చెప్పినట్లు కేజ్రీవాల్ అడ్వైజర్ నరేంద్ర శర్మ విలేకరులకు తెలిపారు.
ప్రస్తుతం తాను ఇతర జాతీయ స్ధాయి కార్యక్రమాలతో బిజీగా ఉన్నందువల్ల ఏదైనా అత్యవసరమైతే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లేదా హోం మంత్రి రాజ్నాథ్ను కలవాలని సూచించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ 10 రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు. ఢిల్లీలో కేంద్రం తరుపున బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ వివాదంతో పాటు పలు అంశాలను చర్చించడం కోసం ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు.
అరవిందే కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్తో భేటీ అయినప్పటికీ, ఆ సమావేశం అంత సంతృప్తికరంగా సాగలేదని తెలిపారు. ఇటీవలే ఏసీబీ చీఫ్గా ఎంకే మీనాకు బాధ్యతలు అప్పగిస్తూ లెప్ట్నెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఏసీబీ చీఫ్గా ఎంకే మీనా బాధ్యతలు స్వీకరించడాన్ని ఆప్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అవినీతి నిరోధక శాఖలో జాయింట్ కమిషనర్ పోస్ట్ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఏసీబీ చీఫ్గా మీనాను తిరిగి వెనక్కి పంపించారు.
దీంతో ఢిల్లీ సీఎం, లెప్ట్నెంట్ గవర్నర్ మధ్య వివాదం చెలరేగింది. మోడీకి సెల్ఫీలు దిగడానికి, ఇంకా ఎన్నో కార్యక్రమాలకు సమయం ఉంటుంది కానీ, ఢిల్లీ సీఎం కోసం కేటాయించడానికి సమయం లేదని మరో ఆప్ నేత విమర్శించారు.