ట్విట్టర్: అగ్ర దేశాధ్యక్షులను వెనక్కినెట్టారు, ఒబామా, పోప్ తర్వాత మోడీనే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హావా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ని సమర్ధవంతంగా వినియోగించుకున్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్ధానం దిశగా దూసుకుపోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ను వినియోగిస్తోన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్ధానంలో 1,95,80,910 ఫాలోయర్లతో క్యాథలిక్కుల మథ గురువు పోప్ ఫ్రాన్సిస్ రెండో స్ధానంలో ఉన్నారు.
ఆ తర్వాత 1,09,02,510 ఫాలోయర్లతో భారత ప్రధాని నరేంద్రమోడీ మూడవ స్ధానంలో నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా విదేశాంగ శాఖ మంత్రుల్లో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎక్కువ మంది ఫాలోయర్లతో మొదటి స్ధానంలో నిలిచారు.
మార్చి 2014 వరకు ప్రపంచంలోని ట్విట్టర్ను కలిగి ఉన్న రాజకీయ నేతలు డేటాని సేకరించి వార్షిక గ్లోబల్ సర్వేలో ట్విప్లమాసీ స్టడీ 2015 పేరుతో ఒక సర్వేని నిర్వహించారు. 2014 సాధారాణ ఎన్నికల్లో నరేంద్రమోడీ విజయం సాధించిన తర్వాత మోడీ ట్విట్టర్ అకౌంట్కు ఫాలోయర్లు ఒక్కసారిగా పెరిగారని ట్విప్లమాసీ సర్వే నిర్వహకుడు మ్యాథిన్స్ లిఫ్కెన్స్ తెలిపారు.