బ్యాలెట్ బాట: జమ్మూ ప్రజలకు మోడీ అభినందన, ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్: తమను ఆశీర్వదించండి.. మీ కలలను సాకారం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. జమ్మూకాశ్మీర్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
జమ్మూకాశ్మీర్ ప్రజలు బుల్లెట్ నుంచి బ్యాలెట్ బాట పట్టారని మోడీ ఈ సందర్భంగా అభినందించారు. మీ కలలను సాకారం చేసేందుకు మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రజలను కోరారు. జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతల్ని కాపాడటం తోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఉపాధి కావాలని యువత కోరుకుంటోందని, పర్యాటక రంగం వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బ్యాంకుల వద్దకు వెళ్తామని పేదలు ఏనాడైనా అనుకున్నారా? అని ప్రశ్నించినా మోడీ, జన్ధన్ యోజన పథకం కింద పేదలకు బ్యాంకు ఖాతా సదుపాయం కల్పించామని తెలిపారు.
గత 30ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో సాధించి పెడతామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రజల మనసుల్లో ఏముందో ప్రపంచానికి తెలిసిందని మోడీ అన్నారు. రాష్ట్ర పార్టీల నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
జమ్మూకాశ్మీర్లో ప్రధానులు అరుదుగా పర్యటించేవారని.. ఎక్కువ సార్లు పర్యటించిన ప్రధానిగా తాను చరిత్ర సృష్టించానని చెప్పారు. తాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వికాసాన్ని తీసుకొచ్చానని తెలిపారు. మళ్లీ డిసెంబర్లోనూ వస్తానని ఆయన చెప్పారు.
కాశ్మీరీ పండిట్లు, పాక్ శరణార్థులకు బిజెపి హామీ
జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాశ్మీరీ పండిట్లు, పాక్ శరణార్థులను బిజెపి తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ‘విజన్ డాక్యుమెంట్'లో వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తామని పలు హామీలు ఇచ్చింది.
కాశ్మీర్ లోయలోని మూడు అసెంబ్లీ సీట్లను రిజర్వేషన్ కింద కాశ్మీరీ పండిట్స్కు తప్పకుండా ఇస్తామని తెలిపింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చి నివాసముంటున్న వారికి ఓటు హక్కు కల్పిస్తామని, తల్లి ఇతర రాష్ట్రాల్లోని వారిని వివాహం చేసుకున్నా, వారి పిల్లలకు ఆస్తి హక్కు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది.
నాలుగో ఉద్రవాది హతం
ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గురువారం ఉదయం ఆర్నియా సెక్టార్లో నిరుపయోగంగా ఉన్న సైనిక బంకర్లలో నలుగురు ఉగ్రవాదులు దాక్కుని కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సైనికాధికారితోపాటు ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి చెందారు.
భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు గురువారం మృతి చెందారు. మరో ఉగ్రవాది బంకర్లోనే దాక్కుని ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం సైనికులపై కాల్పులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరిపి ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఉగ్రవాది కాల్పుల్లో ఓ పౌరుడు మృతి చెందినట్లు సమాచారం.