రేప్ చేయడానికే ఎత్తుకెళ్ళాడు : బెంగుళూరు బాధితురాలు
అందరు చూస్తుండగానే యువతిని ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్గు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు అలసత్వం ప్రదర్శించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అలర్ట్ అయిన పోలీసులు మొత్తానికి దుండగుడిని పట్టుకోవడంలో సఫలమయ్యారు. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించిన సీనియర్ పోలీస్ అధికారి లోకేష్ కుమార్ నిందితుడి పేరు అక్షయ్ కుమార్ గా తెలిపారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత సోమవారం నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. .
కాగా.. గత నెల 23వ తేదీ రాత్రి బ్యూటీ పార్లర్ నుంచి విధులు ముగించుకుని స్నేహితుడి బైక్ పై బయలుదేరిన యువతి, 10 గంటల సమయంలో తను ఉంటున్న పేయింగ్ గెస్గ్ కి దగ్గరలో దిగింది. అనంతరం ఏదో ఫోన్ కాల్ రావడంతో అక్కడే నిల్చుని మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. ఇదంతా సీసీటీవిలో రికార్డవడంతో ఘటనకు సంబంధించిన ద్రశ్యాలు వెలుగుచూశాయి. ఘటన తర్వాత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జరిగిన ఘటన గురించి వివరించిన బాధితురాలు .. నిందితుడు తనను బలవంతంగా నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు లాక్కెళ్లాడని, అత్యాచారం చేయడానికే కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని తెలిపింది. రక్షించమని గట్టిగా అరుస్తున్న సమయంలో నిందితుడు తన నోరు మూసాడని, తనని తాను కాపాడుకునేందుకు అతని చేయిని కొరకగా నిందితుడు తనను కొట్టినట్టుగా పేర్కొంది. నిందితుడు కొట్టడంతో.. భయంతో అపస్మారకస్థితిలోకి వెళ్లానని చెప్పిన బాధితురాలు తనకు మెళుకవ వచ్చేటప్పటికీ నిందితుడు పారిపోయినట్టుగా చెప్పింది.
నిందితుడు తన బ్యాగ్, పర్సు, ఫోన్ ను అక్కడే వదిలేసి వెళ్లాడని.. దీన్నిబట్టి రేప్ చేయడానికే నిందితుడు తనను కిడ్నాప్ చేశాడని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోను నిందితుడిని వదిలిపెట్టవద్దని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.