వింత సమాధానం: బైకులు ఎందుకు తగలబెడుతున్నావ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల బైకులు తగలబడిపోతున్నాయి. దీనిపై పోలీసులకు విపరీతంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దొంగతనాలు జరగడం మామూలే. కానీ ఇలా బైకులు ఎందుకు తగలబడిపోతున్నాయో అర్ధంకాక పోలీసులు సతమతమవుతున్నారు. ఈ బైకులను తగలబెడుతున్నది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఎప్పటిలాగే మే 28న ఒక స్పోర్ట్స్ బైకు తగలబడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజ్లో రికార్డు అయింది. ఈ సీసీటీవి పుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... సునీల్కిశోర్ అనే యువకుడు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి బైకులంటే పిచ్చి. అయితే బైక్ కొనుక్కోవడానికి డబ్బు లేకపోవడంతో బైక్లున్న వారిని చూసి అసూయ చెంది, గత పది రోజుల్లో దాదాపు ఎనిమిది బైకులు తగలబెట్టేశాడు. ఇదే క్రమంలో మే 28న సునీల్ బైక్ తగలబెడుతున్న దృశ్యం అక్కడ సీసీటీవీలో రికార్టు అయింది.
సీసీటీవీలో సునీల్ బైక్ నుంచి పైపు ద్వారా పెట్రోల్ తీసి దాని మీదే పోసి తగలబెట్టగా, అది చూసిన స్థానికులు మంటలను ఆర్పడానికి వచ్చినప్పుడు ఏమీ తెలియనట్లు సునీల్ కూడా వారికి సాయపడినట్లు సీసీటీవీలో రికార్టు అయింది. దీంతో సీసీటీవి పుటేజ్ ఆధారంగా సునీల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు.
విచారణలో సుశీల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు బైకులంటే చాలా ఇష్టమని, అయితే వాటిని కొనుక్కునే స్తోమత లేదని, వాటిని దొంగతనం చేస్తే దొరికిపోయే ప్రమాదం ఉంది కనుక, తనకు లేని బైకులు ఇతరులకు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే వాటిని తగులబెడుతున్నానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.