‘సెక్స్ టూరిజం, వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు’
పనాజి: గోవాకు చెందిన రాజకీయ పార్టీలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్స టూరిజం, వ్యభిచారం, మాదకద్రవ్యాలకు గోవాను అడ్డగా మార్చేశారని ధ్వజమెత్తారు.
ఇవి గోవా పేరు ప్రతిష్టలను దిగజార్చుతున్నా.. రాష్ట్ర రాజకీయ పార్టీల ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అంతేగాక, మద్దతుగా నిలుస్తున్నాయని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. గోవాలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ బుధవారం పనాజీలో చిన్నస్థాయి హోటళ్లు, పర్యాటక పరిశ్రమ వాటాదారులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
సెక్స్ టూరిజం , డ్రగ్స్, వ్యభిచారం వల్ల గోవాలో పర్యాటకానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. రాజకీయ పార్టీలు కూడా వీటికి మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు.
వచ్చే ఏడాదిలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన ఆమ్ ఆద్మీ పార్టీ 'గోవా డైలాగ్స్' పేరిట సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది. గోవాలో తామే అధికారం చేజిక్కించుకుంటామని ఇప్పట్నుంచే అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.