దాడి: జయలలిత మృతిపై పొన్నియన్ సంచలనం
పన్నీరు వర్గానికి చెందిన అన్నాడియంకె నేత పొన్నియన్ జయలలిత మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళకు ఎందుకు అంటు వ్యాధి సోకలేదని అడిగారు.
చెన్నై: ఆసుపత్రిలో చేరటానికి ముందు పోయెస్ గార్డెన్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై దాడి జరిగిందని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారని అన్నాడీఎంకే (పన్నీర్వర్గం) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సి. పొన్నయన్ సంచలన ఆరోపణ చేశారు.
జయలలిత మృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, అపోలో ఆసుపత్రితో శశికళ రహస్య ఒడంబడిక కుదుర్చుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఇంటి వద్ద పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వార్డులో ఎవరినీ అడుగు పెట్టనివ్వలేదని, లోపలకు వస్తే అంటువ్యాధులు సోకుతాయని పదే పదే బెదిరించారని చెప్పారు. 73 రోజుల పాటు జయలలిత వద్దే గడిపారని చెబుతున్న శశికళకు అంటువ్యాధులు ఎందుకు సోకలేదో అర్థం కావటం లేదన్నారు. జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.