అశ్లీల ఫొటోలు పంపిస్తే..ఇక అంతే, కఠిన చర్యల దిశగా బెంగళూరు పోలీసులు
సామాజిక మాధ్యమాలలో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత, ఇతర మతాలపై అనుచిత సందేశాలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నా
బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో అవహేళనకరంగా పోస్టు. కావేరి కోసం కర్ణాటక ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసనలకు దిగుతుంటే కర్ణాటక కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో వ్యంగ్య చిత్రాలు.
రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావప్రకటన విపరీత స్థాయికి చేరింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, వియ్ చాట్ తదితర సామాజిక మాధ్యమాలలో అశ్లీల సందేశాలు, ఫొటోలు, వ్యక్తిగత, ఇతర మతాలపై అనుచిత సందేశాలు అప్ లోడ్ చేస్తుండడం వల్ల సమాజ భద్రతకే ముప్పు వాటిల్లుతోంది.
ఇక ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కర్ణాటక పోలీసులు నిర్ణయించుకున్నారు. అశ్లీల, అవహేళన రీతిలో ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేసే వ్యక్తులపై గట్టి చర్యల ద్వారా ఇటువంటి వాటిని అరికట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తులతోపాటు ఇతర మతాలపై కూడా నిందాపూర్వక సందేశాలు పోస్టు చేస్తున్న ఘటనలు పెచ్చుమీరడంతో సదరు వ్యక్తులపై సుమోటో కేసును నమోదు చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను అరెస్టుచేసే చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనల్లో బాధితులు పోలీసుస్టేషన్లకు రావలసిన అవసరం కూడా లేదు.. కేవలం ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా చాలు.. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయించుకున్న పోలీసు శాఖ అందుకు తగ్గట్లుగా తమ సిబ్బందికి కూడా సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేందకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటోంది.
దీంతో ఫేస్ బుక్, యూట్యూబ్ లో అవహేళనకర పోస్టులు చేసే వ్యక్తల ఖాతాలను బాధితుల ఫిర్యాదుల మేరకు రద్దు చేసే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసుశాఖలోని ఇతర ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.