ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం: వారికి కేసీఆర్ సన్మానం
నయా రాయ్పుర్/హైదరాబాద్: వెయ్యి మెగావాట్ల విద్యుత్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
ఇందుకు సంబంధించిన ఒప్పందం పైన రెండు రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేశారు. ఈ ఒబ్బందంతో తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ ఒప్పందం రాయ్పూర్లోని బాబిలోన్ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగింది.
కేసీఆర్ సన్మానం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మంత్రులను సన్మానించారు. విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధం చరిత్ర పూర్వకాలం నాటిదన్నారు. తమ కాకతీయ రాజ్యానికి చెందిన అవశేషాలు ఇంకా ఇక్కడ ఉన్నాయన్నారు. ఛత్తీస్గఢ్ తమకు పొరుగు రాష్ట్రమేనని, ఒకప్పుడు ఆ రాష్ట్ర ఇబ్బందులు కూడా ఢీల్లీ స్థాయిలో ప్రస్తావించే వాళ్లమన్నారు.
స్వామిగౌడ్కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీల విలీనం లేఖ
తెలంగాణకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలం సమావేశమయ్యామని ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. తమ పార్టీని తెరాసలో విలీనం చేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి లేఖ ఇచ్చామన్నారు. షెడ్యూల్ టెన్ ప్రకారం విలీనం అయ్యే హక్కు తమకు ఉందన్నారు. కాగా, స్వామి గౌడ్ను కలిసిన వారిలో వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, సలీం, నరేంద్రలు ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఏడుగురు ఎమ్మెల్సీల్లో ఐదుగురు తెరాసలో చేరారు.
కేసీఆర్, బాబుపై రఘువీరా ఆగ్రహం
రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఏపీలో మండిపడ్డారు. రాజధాని కోసం వ్యవసాయ భూమి జోలికి వెళ్లవద్దన్నారు. అస్పష్టమైన ప్రకటనలతో రైతులలో ఆందోళన నెలకొందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దారుణంగా, అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణా బోర్డు చైర్మన్ పైన కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు.