కోవింద్కు పోటీగా అంబేద్కర్ వారసుడు, సీపీఎం సూచన, రేపు తుది నిర్ణయం
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు పోటీగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు.. ప్రకాష్ అంబేద్కర్ ను నిలబెడితే గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని సీపీఎం భావిస్తోంది.
న్యూఢిల్లీ: దళిత మేధావిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోన్న అధికార పక్షానికి.. అంతే గట్టిగా పోటీ ఇవ్వాలని విపక్షాలు భావిస్తున్నాయి.
ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు పోటీగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ను అభ్యర్థిగా నిలబెడితే గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని సీపీఎం భావిస్తోంది.
ఇదే విషయాన్ని కాంగ్రెస్ సహా 18 విపక్ష పార్టీలకు విన్నవించినట్లు, గురువారం ఢిల్లీలో జరగనున్న భేటీలో ప్రకాశ్ అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సీపీఎంకు చెందిన కీలక నాయకుడొకరు తెలిపారు.
మహారాష్ట్రలో భరిప్ బహుజన్ మహాసంఘ్(బీబీఎం) పార్టీకి నేతృత్వం వహిస్తోన్న ప్రకాశ్ అంబేద్కర్ గతంలో అకోలా పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. ఒకమారు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు.
మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీకి చెందిన అభ్యర్థినే రాష్ట్రపతిగా పోటీకి నిలపాలని భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ స్పీకర్ మీరాకుమార్, మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
ఇంతలో సీపీఎం నేతలు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. మరి విపక్షాల తుది నిర్ణయం ఎలా ఉంటుందో, రాష్ట్రపతి రేసులో ఎవరిని నిలబెడతారో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.