కేజ్రీవాల్పై ఏఏపీ ఫౌండర్ మెంబర్ అప్సెట్! 70 సభల్లో కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ మెంబర్స్ శాంతిభూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్లు ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రశాంత్ భూషణ్ శనివారం తీవ్ర కేజ్రీవాల్ తీరు పైన అనుమానం వ్యక్తం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ అభ్యర్థుల ఎంపికలో డబ్బులు, ఇతరత్రా చూస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించారు.
కిరణ్ బేడీ నాపై పోటీ చేయాల్సింది
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కిరణ్ బేడీ తన పైన పోటీ చేయాల్సి ఉండెనని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తామిద్దరం అవినీతిపై ఉద్యమిస్తున్నా.. ప్రస్తుతం వేర్వేరు నియోజకవర్గాల నుండి జరగడం పెద్దగా ఆసక్తినివ్వడం లేదన్నారు. త్వరలో ఈసారి తనకు ప్రధానమైన అభ్యర్థి కిరణ్ బేడీ అన్నారు.
గతంలో తాను మూడుసార్లు సీఎం పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ పైన పోటీ చేసి గెలిచానని, కిరణ్ బేడీ కృష్ణా నగర్ నుండి కాకుండా తాను పోటీ చేస్తున్న ఢిల్లీలో పోటీకి దిగాల్సిందన్నారు. మరోవైపు, కిరణ్ బేడీ తన ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తన అకౌంటును ఎందుకు బ్లాక్ చేశారో ఆమె చెప్పాలన్నారు. తాను ట్విట్టర్లో ఎప్పుడు మర్యాదపూర్వక భాషనే వాడుతున్నానన్నారు.
మతఘర్షణల వ్యాఖ్యలపై కేజ్రీవాల్కు ఇసి మందలింపు
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలను బీజేపీ రెచ్చగొడుతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా మందలించింది.
అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ మరోసారి చేసిన వ్యాఖ్యలపై ఇసి ఆయనకు తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఈసీ తగిన చర్య తీసుకుంటుందని ఈసీ ఆ నోటీసులో పేర్కొంది.
వాజపేయి, అద్వానీ ఆశీస్సులు తీసుకున్న కిరణ్ బేడీ
కిరణ్ బేడీ శుక్రవారం బీజేపీ అగ్రనేతలు వాజపేయీ, అద్వానీల ఆశఈస్సులు తీసుకున్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్లానని, అద్వానీ ఆశీర్వదించి కష్టపడి పని చేయాలని చెప్పారని కిరణ్ బేడీ తెలిపారు. బేడీపై తనకు నమ్మకముందని, ఆమె నాయకత్వంలో ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తామని అద్వానీ అన్నారు. కాగా, కిరణ్ బేడీ ఢిల్లీలో 70 సభలను నిర్వహించనున్నారు.
కరెంటు బిల్లు సగానికి తగ్గిస్తాం
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటి కరెంటు బిల్లును సగానికి తగ్గిస్తామని దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్న బీేపీ హామీ ఇస్తోంది. చౌకధరకు ఎల్ఇడి బల్బులను సరఫరా చేయడం ద్వారా విద్యుత్ బిల్లులను సగానికి తగ్గిస్తామని హామీ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ముఖ్యమంత్రి కిరణ్ బేడీ ఫోటోలతో భారీ హోర్డింగ్లను ఆ పార్టీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.