గర్భిణిని రైల్లోంచి తోసేసిన భర్త: పట్టాలపైనే ప్రసవం, శిశువు మృతి
రాయగడ: గర్భిణి అని కూడా చూడకుండా తన భార్యను రైల్లోంచి తోసేశాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ సంఘటన ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో చోటుచేసుకుంది. భర్త రైలు నుంచి తోసేయడంతో రైలు పట్టాలపైనే ప్రసవించింది.
ఈ సంఘటనకు సంబంధించి రాయగడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సరోజిని అనే గర్భిణి తన భర్తతో కలిసి సొంత పట్టణం రూర్కెలా వెళ్లేందుకు గాను జగదల్ పూర్ - హౌరా ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలు కోరాపుత్ - రాయగడ మధ్య ప్రాంతంలోకి రాగానే తన భర్త సురజ్ కెర్కెతా వేరే ఫోన్లో మహిళతో మాట్లాడుతుండగా అడ్డు చెప్పింది.
దీంతో తనపై ఆగ్రహించిన భర్త తెల్లవారుజామున 4 గంటల సమయంలో రౌలి స్టేషన్ రాగానే నిద్రపోతున్న తనను లేపి రైల్లోంచి తోసేసినట్లు బాధితురాలు పోలీసుల విచారణలో వెల్లడించింది. బాధితురాలు రైలు పట్టాలపైనే ప్రసవం కావడంతో శిశువు అక్కడికక్కడే మరణించింది.
సమాచారం అందుకున్న రాయగడ రైల్వే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని బాధిత మహిళను సమీపంలోని రైల్వే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి చికిత్సనందించిన వైద్యులు ప్రస్తుతం మహిళ పరిస్ధితి స్ధిరంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి భర్త, నిందితుడి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.