అభివృద్ధి?: కాన్పు కోసం 6కి.మీ.లు నడిచిన నిండు గర్భిణి!
భోపాల్: దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పుకుంటున్నాం.. కానీ, కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాయి. కనీస అవసరాలకు కూడా అవి నోచుకోవడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలిచింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఘటన.
వివరాల్లోకి వెళితే.. ఛతర్పూర్ ప్రాంతంలోని సమరియా గ్రామానికి చెందిన సంధ్యాయాదవ్ నిండు గర్భిణి. ప్రసవం కోసం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం స్థానిక ఆరోగ్య కార్యకర్త ప్రభుత్వ అంబులెన్స్ సదుపాయం అయిన జననీ ఎక్స్ప్రెస్కు ఫోన్ చేశారు.
అరగంటలో అంబులెన్స్ వస్తుందని ఆస్పత్రి వాళ్లు సమాధానం ఇచ్చారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడం, ఆమెకు నొప్పులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఓ ఆటోలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు.
అయితే దురదృష్టవశాత్తు ఆ ఆటో కూడా మధ్యలోనే మొరాయించింది. దీంతో చేసేది లేక తోటి ఆడవాళ్ల సాయంతో మోకాటి లోతు నీళ్లలోనే ఆరు కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లింది.
ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆమెకు ప్రసవం అయింది. కాగా, తమ గ్రామానికి సరయిన రోడ్డు సదుపాయం లేదని సంధ్యా యాదవ్ భర్త వాపోయాడు.
కాగా, ఇలాంటి సంఘటన తమ గ్రామంలో కొత్తేమీ కాదని, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని, గర్భిణీలను మంచాలపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయని సంధ్యా యాదవ్ తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.