ఆర్మీ ఆసుపత్రి నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిశ్శార్జి
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్శార్జి అయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయనకు ఇటీవలే గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది.
పూర్తిగా కోలుకున్న ఆయన్ని వైద్యులు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్శార్జి చేశారు. శుక్రవారం సాయంత్రం బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో రాష్ట్రపతి భవన్లో సమావేశం కానున్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన హమీద్తో ప్రణబ్ ముఖర్జీ సమావేశం కానున్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఆయన్ని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ప్రణబ్ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గురువారం పరామర్శించారు.
అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటన రద్దైన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ రావాల్సి ఉంది. హైదరాబాద్లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంది.