గర్వంగా ఉంది: ఐఎఫ్ఆర్లో సుమిత్రాపై రాష్ట్రపతి
విశాఖపట్నం: విశాఖ సాగరతీరంలో ఇంటర్నేషన్ల్ ప్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 4నే ఈ వేడుక ప్రారంభమైనప్పటికీ ప్లీట్ రివ్యూలో అసలు కార్యక్రమాలకు ఈరోజు నుంచి తెర లేవనుంది. ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారిద్దరికీ ఘన స్వాగతం పలికారు. ఇంటర్నేషన్ల్ ప్లీట్ రివ్యూలో భాగంగా శనివారం భారత నావికాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరై నౌకాదళాల గౌరవందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమిత్రాలో ప్రవేశించారు.
అంతకముందే ఐఎన్ఎస్ సుమిత్రాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిద్దరూ ఐఎన్ఎస్ సుమిత్రాలో పయనిస్తూ యుద్ధనౌకల సమార్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత నావికా దళంలో ఉన్న యుద్ధనౌకల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంటర్నేషన్ల్ ప్లీట్ రివ్యూలో సుమారు 70 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. యుద్ధనౌకలను రాష్ట్రపతి సమీక్షిస్తున్నారు. ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకను మరో ఐదు యుద్ధనౌకలు అనుసరిస్తున్నాయి. ఆరు వరుసల్లో యుద్ధనౌకలు కొలువుదీరాయి. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి జయహో అంటూ నేవీ అధికారులు అభివందనం చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్తో పాటు ఐఎన్ఎస్ సుమిత్రాలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, త్రివిధ దళాల అధిపతులు కూడా ఉన్నారు.
Glimpses from the International Fleet Review. pic.twitter.com/qfimF8XIuT
— PMO India (@PMOIndia) February 6, 2016
PM @narendramodi at the Guard of Honour. pic.twitter.com/3pozv8cGtc
— PMO India (@PMOIndia) February 6, 2016
అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ, అంతర్జాతీయ నౌకాదళ గౌరవ వందనం స్వీకరించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. సాగర మధ్యలో ఈ పరేడ్ నిర్వహించడం ప్రపంచంతో స్నేహహస్తానికి నిదర్శనమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నౌకలు మన తీరానికి రావడం చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
సముద్ర తీర రక్షణలో నౌకాదళ సమీక్ష కొత్త ముందడుగని రాష్ట్రపతి తెలిపారు. సముద్రతలంపై శాంతి, ప్రశాంతి నెలకొల్పడంలో నౌకాదళాలది కీలక భూమి అని చెప్పారు. ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో భాగంగా మీడియా ప్రతినిధుల కోసం ఐఎన్ఎస్ సునయన కేటాయించారు. అందులో ప్రయాణిస్తూ నౌకల ప్రదర్శనను వీక్షిస్తున్నారు. ఐఎఫ్ఆర్లో 90 భారత నేవీ నౌకలు పాల్గొన్నాయి.