అమేథిలో ఐఐఐటీ: ప్రియాంక ప్రశ్నకు ధీటైన జవాబిచ్చిన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంగ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథిలో ఇప్పటి వరకు ఐఐఐటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
ప్రియాంక తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రాయ్ బరేలీ, అమేథిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తన ప్రశ్నకు తప్పక సమాధానం చెప్పి తీరాలని అన్నారు. అమేథికి ఏదో చేయాలని అనుకుంటున్న ఆమె ఐఐఐటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.
విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖను నిర్వహిస్తున్నా, ఐఐఐటీ విషయాన్ని ఆమె ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథిలో పర్యటించిన స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అమేథి పుడ్ పార్క్ విషయంపై ప్రియాంక మాట్లాడుతూ దానిపై తన వద్ద ఎలాంటి సరైన సమాచారం లేదన్నారు. తనపై ప్రియాంక గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అమేథీలో ఐఐఐటీ గురించి ప్రస్తావిస్తూ, ప్రియాంక సరైన హోం వర్క్ చేయకుండా అమేథి వెళ్లారని అన్నారు.
ఐఐఐటీ అలహాబాద్కు చెందిన ఒక ఆఫ్ క్యాంపస్ అమేథీలో ఉందని ఆమె గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అమేథీలో గెలిచిన అభ్యర్థి, ఓడిపోయిన తనన్ని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా అడుగుతున్నారని మంత్రి ప్రశ్నించారు.
గత 60 సంవత్సరాలుగా అమేథి, రాయ్ బరేలీ నియోజక వర్గాలు గాంధీ కుటుంబానికి కంచు కోటల్లాగా ఉన్నా, ఏమీ చేసిన పాపాన పోలేదని, ఇది అత్యంత దారణమని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ లోపం గురించి తెలిసే, ఆయన తన సొంత గడ్డపై తనను తాను రక్షించుకోలేక, అదనపు ఆయుధాలను (చెల్లెలు ప్రియాంక) తెచ్చుకున్నారా అని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.