భర్త కోసం వ్రతం చేస్తుంటే అక్కడే కాల్చి చంపేశాడు
న్యూఢిల్లీ: భర్తలు క్షేమంగా ఉండాలని, తమ పసుపు కుంకాలు చిరకాలం నిలవాలని, కట్టుకున్న భర్త దీర్ఘాయుష్టు కోరుకుంటూ ఉత్తర భారతదేశంలో కడ్వా చౌత్ వ్రతం చేస్తుంటారు. అలా వత్రం చేస్తున్న భార్య ముందే భర్తను రివాల్వర్ కాల్చి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలో ఆశారామ్ (42) అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నారు. ఆయన బీజేపీ ఎంపీకి సన్నిహితుడు. ఆశారామ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆశారామ్ భార్య గురువారం కడ్వా చౌత్ వ్రతం చేశారు.
ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆశారామ్ ఇంటిలోనే ఉన్నారు. భర్తకు కొన్ని అడుగుల దూరంలో ఆయన భార్య కుర్చుని ఉన్నారు. ఆ సమయంలో పసుపు పచ్చరంగు షర్టు వేసుకుని వచ్చిన యువకుడు (25) రివాల్వర్ తో ఆశారామ్ చాతిలో కాల్చి పారిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆశారామ్ ను వెంటనే సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై మరణించాడని పోలీసులు అన్నారు. తన భర్తకు ఎవరూ శత్రువులు లేరని ఆశారామ్ భార్య పోలీసులకు చెప్పారు.
గత దీపావళి రోజు ఢిల్లీలో జరిగిన కాల్పుల కేసులో ఆశారామ్ ప్రధాన సాక్షి. అయితే ఈ కేసుకు సంబంధించి ఆశారామ్ హత్య జరగలేదని పోలీసులు అంటున్నారు. ఆశారామ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యలేదని, ఆయన భార్య ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.