తప్పుడు రేప్ కేసు పెడితే మహిళను శిక్షించాలి: కోర్టు
న్యూఢిల్లీ: అత్యాచారం జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తే మహిళకు శిక్ష విధించాల్సిన సమయం ఆసన్నమైందని ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. తప్పుడు అత్యాచారం కేసుల వల్ల నేరాలు పెరిగినట్లు కనిపించి, గణాంకాల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారానికి సంబంధించిన సమాచారం వ్యాపించి, నిందితుడు సమాజంలో చిన్నచూపునకు గురవుతున్నాడని కోర్టు వ్యాఖ్యానించింది.
అత్యాచారం కేసుల విషయంలో నిందితుడికి తీవ్ర ఉద్వేగభరితమైన నిస్పృహ, వేదన కలుగుతాయని, తప్పుడు అత్యాచారం కేసులు కూడా మనిషిని అదే రీతిలో బాధపెడుతుందని, మర్యాదకు భంగం కలుగుతుందని, మానసిక వేదన పెరుగుతుందని కోర్టు వివరించింది.
నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా సమాజ ప్రధాన స్రవంతికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నది. అతనికి ప్రతిచోటా అవహేళన ఎదురవుతుందని చెప్పింది. కేసు నుంచి నిర్దోషిగా బయటపడినా కూడా తిరిగి ఆ గౌరవం, స్థానం తిరిగి లభించిందని కోర్టు చెప్పింది. జీవితాంతం అత్యాచార నిందితుడిగానే సమాజంలో అవమానాన్ని భరించాల్సి వస్తుందని అన్నది.
పగ తీర్చుకోవడానికి ఓ వ్యక్తి మహిళ చేత ఢిల్లీ వ్యాపారవేత్తపై తప్పుడు ఆరోపణలతో పెట్టిన అత్యాచారం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవడానికి తమ వద్ద తగిన విధానాలు లేవని చెప్పింది. పురుషులపై తప్పుడు అత్యాచారం కేసులు ఎలా బనాయిస్తారని చెప్పడానికి ఈ కేసు ప్రబల నిదర్శనమని కోర్టు చెప్పింది.