స్మగ్లర్ బరితెగింపు: పోలీసునే కారుపై ఈడ్చుకెళ్లాడు(వీడియో)
చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ముఠా ఆగడాలు రోజు రోజుకు మరీ ఎక్కువవుతున్నాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలిసి అతడ్ని పట్టుకోవడానికి యత్నించిన పోలీసునే కారు బోనెట్పై ఈడ్చుకెళ్లాడు ఓ స్మగ్లర్. అంతేగాక, ఆ పోలీసుపై నుంచి కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణ ఘటన ఆదివారం లుధియానాలో చోటుచేసుకుంది.
నిందితుడు సన్నీ దోడా హెరాయిన్ సరఫరా చేయడానికి సిమ్లాపురి ప్రాంతానికి వచ్చాడు. ముందుగా సమాచారం అందుకున్న ఏఎస్సై సంజీవ్కుమార్ తన బృందంతో కలిసి సిమ్లాపురి వద్ద నిఘా పెట్టారు. స్మగ్లర్ సన్నీ సరిగ్గా పోలీసుల ఎదుటే కారు ఆపడంతో ఏఎస్సై సంజీవ్ వెంటనే అతన్ని పట్టుకోవడానికి యత్నించాడు. ఇంతలో సన్నీ కారు వేగంగా పోనివ్వడంతో ఏఎస్సై కారు బానెట్పై దూకారు.
అది చూసి కూడా నిందితుడు కారు ఆపకుండా పోలీసుని 200 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారు పక్కగా కిందపడటంతో ఆ ఏఎస్సై చేతికి గాయాలయ్యాయి. కాగా, ఈ సన్నివేశం అక్కడి వీధుల్లోని సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, నిందితుడి కోసం పోలీసు బృందం తనిఖీలు నిర్వహించినా లాభం లేకుండాపోయింది. నిందితుడిని పట్టుకోవడానికి ఏఎస్సై సంజీవ్ చేసిన సాహసం అభినందనీయమని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. ఒక పోలీసునే కారుపై ఈడ్చుకెళ్లిన నిందితుడ్ని వదిలిపెట్టమని పంజాబ్ యాంటీ నార్కోటిక్ వింగ్ పోలీసులు స్పష్టం చేశారు.