"ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తాం"
దీనానగర్: ఉగ్రవాదుల దాడులలో వీరమరణం పొందిన డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అంత వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని వారు అంటున్నారు.
తమ కుమారుడు మనీందర్ సింగ్ (24) ఎస్పీ ర్యాంకు ఉద్యోగం, కుమార్తెలు పరమీందర్ కౌర్ (22), రవీందర్ కౌర్ (20)లకు తహసిల్దార్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని ఎస్పీ బల్జీత్ సింగ్ భార్య కల్వంత్ కౌర్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుండి అపాయింట్ మెంట్ లెటర్లు వచ్చే దాకా అంత్యక్రియలు నిర్వహించడానికి తాము అంగీకరించబోమని ఆమె అధికారులకు చెప్పారు. తమ మామ అచ్చార్ సింగ్ సిక్కు అల్లర్లో చనిపోయిన తరువాత తన భర్తకు ఉద్యోగం రావడానికి రెండు సంవత్సరాలు వేచి చూశామని ఆమె అంటున్నారు.
బల్జీత్ సింగ్ తండ్రి అచ్చర్ సింగ్ ఇన్స్ పెక్టర్ గా పని చేశారు. 1984 సిక్కు అల్లర్లలో ఆయన వీరమరణం పొందారు. అయితే బల్జీత్ కుటుంబ సభ్యుల డిమాండ్ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పంజాబ్ సీనియర్ అధికారులు అంటున్నారు. సోమవారం దీనానగర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడులలో బల్జీత్ సింగ్ వీరమరణం పొందారు.