పీవీకి స్మారకం: మోడీకి కితాబు, సోనియాపై ఫ్యామిలీ అప్సెట్
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పీవీ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తున్నారు.
ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన, మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపిన ఘనత పీవీ సొంతం. ఇలాంటి పీవీని కాంగ్రెస్ పార్టీ విస్మరించారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పీవీకి ఢిల్లీలో స్మారక స్థూపం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
దీనిపై పీవీ తనయులు పీవీ రాజేశ్వర రావు, పీవీ ప్రభాకర రావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీవీ అభిమానులు కూడా మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం యమునా నది ఒడ్డున పీవీ మెమోరియల్ నిర్మించనుంది.
ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పీవీ స్మారక స్థూపం విషయమై పలుమార్లు డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దానిని నెరవేర్చడం సంతోషమని చెబుతున్నారు.
పీవీ నర్సింహా రావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో హామీ ఇచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ దానిని నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఈ పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ విషయం విస్మరించారని మండిపడుతున్నారు.