ఎన్టీఆర్ గందరగోళం: బాబుపై ఎన్టీఆర్ ఫ్యామిలీ ఒత్తిడి తేవాలని వినోద్
న్యూఢిల్లీ: హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో బుధవారం గందరగోళం చెలరేగింది. ఈ సమయంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరే కొనసాగుతుందని కుండబద్ధలు కొట్టారు. రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలే అన్నారు.
కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక గజపతి రాజు మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించామని వెల్లడించారు. అయితే, విమానాశ్రయానికి రాజీవ్ పేరు అలానే ఉందన్నారు. ఇందులో తామెలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
గన్నవరం విమానాశ్రయానికి పెట్టుకోండి: రాపోలు
శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజ్యసభలో అన్నారు. పేరును మార్చరాదని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఎన్టీఆర్ పేరే కావాలనుకుంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు పెట్టుకోవాలన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు.
చంద్రబాబు కుట్ర: వినోద్ కుమార్
శంషాబాద్ విమానాశ్రయం పేరు పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని తెరాస ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. అంతగా కావాలనుకుంటే గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. సొంత జిల్లాలోని విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టకపోగా, పక్క రాష్ట్ర విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును పరిమితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బాబు పైన ఒత్తిడి తేవాలన్నారు.
ఎన్టీఆర్ పేరుపై వివాదం వద్దు: గరికపాటి
శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, గరికపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో అన్నారు. టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును మార్చే ఉద్దేశ్యం లేదని సభలో జైట్లీ చెప్పారన్నారు. తెలంగాణ శాసన సభ దురుద్దేశ్యంతో తీర్మానం చేసిందన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ఎన్టీఆర్ను కాంగ్రెస్ నేతలు ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారన్నారు. దేశీయ టెర్మినల్కు గతంలో ఉన్న ఎన్టీఆర్ పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. దానికి సంబంధించి పౌర విమానయాన శాఖ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.