లీక్: వాట్సప్లో యుపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రొవెన్షియల్ సివిల్ సర్వీసెస్ (పిసిఎస్) ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం ఆదివారం పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందే లీక్ అయింది. దీంతో మండిపడిన ప్రతిపక్షాలన్నీ ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, యుపిపిఎస్సి చైర్మన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
‘ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభం కావడానికి కొద్ది ముందు 9.15 గంటల సమయంలో వాట్సప్ మెస్సెంజర్లో ప్రశ్నపత్రం లీక్ అయింది. ఒరిజినల్ ప్రశ్నపత్రంతో అది సరిపోయింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి తెలియజేశా' అని పోలీసు డైరెక్టర్ జనరల్ ఎకె జైన్ మీడియాకు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయని కూడా ఆయన చెప్పారు. ఎస్టిఎఫ్ బృందాలు వీటిపై దర్యాప్తు జరుపుతున్నాయని, త్వరలోనే పేపర్ లీక్ ఎలా జరిగిందో తెలుసుకుంటామని ఆయన చెప్పారు.
లక్నోలో పిసిఎస్ ప్రిలిమినరీ పరీక్షను 148 కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉండగా, దాదాపు 70 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, రాష్టవ్య్రాప్తంగా మొత్తం 917 సెంటర్లలో 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.