రూ. 5కే: ఆన్లైన్లో పిల్లాడ్ని అమ్మకానికి పెట్టారు
న్యూఢిల్లీ: పాత, కొత్త వస్తువులను అమ్మేందుకు, కొనేందుకు ఇటీవల అనేక ఆన్లైన్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ సైట్లలో కొందరు ప్రబుద్ధులు.. అమ్మాయిలు, వ్యక్తుల ఫొటోలను పోస్టు చేసి అమ్మకానికి పెట్టినట్లు చూపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది.
వస్తువుల అమ్మకందారులు ఎక్కువగా ఆశ్రయించే వెబ్సైట్ అయిన క్వికర్.కామ్లో ఓ వ్యక్తి ఒక పిల్లాడిని అమ్మకానికి పెట్టాడు. అది కూడా రూ. 5కే. ఆ పిల్లాడి ఫొటోను పోస్టు చేసి ‘రాహుల్ ఫర్ సేల్' అని పేర్కొన్నాడు. అది చూసిన బాలల హక్కుల సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
‘మాకు ఓ బాలుడ్ని అమ్మకానికి పెట్టడంపై ఫిర్యాదు అందింది. దీనిపై విచారిస్తున్నాం' అని సమాచార మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి గుల్షన్ రాయ్ తెలిపారు. కాగా, బాలుడి అమ్మకం ప్రకటన చెన్నై ప్రాంతం నుంచి పోస్టు చేయబడినట్లు తెలిసింది.
ఈ విషయంపై సమాచార మంత్రిత్వ శాఖ క్వికర్ యాజమాన్యాన్ని వివరణ కోరగా, జరిగిన ఘటనకు తాము చింతిస్తున్నామని, ఆ ప్రకటనను తాము సైట్ నుంచి తీసివేశామని తెలిపింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో పునరావృం కాకుండా చూసుకుంటామని పేర్కొంది. అయితే ఆ ప్రకటన ఎవరు పోస్ట్ చేశారో తమకు తెలియదని తెలిపింది.