ఢిల్లీ ఎయిర్ పోర్టులో రేడియేషన్ లీక్, పరిస్ధితి అదుపులోనే: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రేడియేషన్ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. విమానాశ్రయంలోని కార్గో ప్రాంతంలో ఈ రేడియేషన్ పదార్ధం లీక్ అయినట్లు తెలుస్తోంది.
రేడియేషన్ లీక్తో అక్కడ పని చేస్తున్న ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రేడియేషన్ లీక్కు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.
టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానంలో ఈ రేడియేషన్ లీక్ అయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోర్టిస్ ఆస్పత్రి కోసం ఇస్తాంబుల్ నుంచి దీన్ని తెప్పించారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. ఈ విషయంపై ఫోర్టిస్ ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నట్టు చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయంలో కార్గో కాంప్లెక్స్ నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం రేడియేషన్ లీకేజి పరిస్ధితి అంతా అదుపులోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. రేడియేషన్ బృందం కూడా విమానాశ్రయానికి చేరుకున్నారని తెలిపారు.
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రేడియేషన్ లీకైందన్న కోణంలో సీఐఎస్ఎఫ్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.