మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ : ధరల నియంత్రణపై నిలదీత
న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదలపై ప్రధాని మోడీని నిలదీశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో చర్చల సందర్బంగా ధరల పెరుగులపై మండిపడ్డ రాహుల్.. గత ఎన్నికల్లో ధరల నియంత్రణపై ఇచ్చిన హామిని బీజేపీ నిలబెట్టుకోలేపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన రాహుల్ గాంధీ, ధరలు ఎప్పటినుంచో తగ్గిస్తారో స్పష్టమైన తేదీని ప్రకటించాలంటూ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణంపై ప్రధాని మోడీ మౌనం వీడి ఖచ్చితమైన సమాధానం చెప్పాలన్నారు రాహుల్.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ విధానాలను తీవ్రంగా ఆక్షేపించిన రాహుల్ బీజేపీ రెండేళ్ల పాలనను తూర్పారా పట్టారు. 'మోడీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన మోడీ మేక్ ఇండియా, కనెక్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ మాట్లాడారు తప్పితే, దేశంలో పెరిగిన పప్పులు, ఆలుగడ్డలు, టొమోటో ధరలపై మాత్రం నోరు మెదపలేదని' ఆరోపించారు రాహుల్.
ధరల పెరుగుదలకు సంబంధించి నిబద్దతలేని హామిలు ఇవ్వడం సరికాదన్న రాహుల్.. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాల్లో నకిలీ హామిలు ఇవ్వవచ్చేమో గానీ ధరల పెరుగుదలలో మాత్రం కాదని ప్రధాని మోడీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వ పోకడలను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన..స్వచ్ఛ భారత్ ద్వారా దేశమంతా పరిశుభ్రంగా మారిందని అధికార పక్షాన్ని ఎద్దేవా చేశారు.