రాహుల్ పర్యటన ఫ్లాప్: అనుమతి లేకున్నా బయలుదేరి.. సరిహద్దు వెలుపలే నిలిచిపోయి..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినా షహరాన్పూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సరిహద్దుల్లోనే ఆగిపోవలసి వచ్చింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినా షహరాన్పూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సరిహద్దుల్లోనే ఆగిపోవలసి వచ్చింది. పోలీసులు ఆయన్ని షహరాన్ పూర్ నగరంలోకి గానీ, జిల్లాలోకి గానీ అనుమతించలేదు. దీంతో రాహుల్ గాంధీ షహరాన్ పూర్ సరిహద్దుల వద్దే సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.
ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన కారణంగా కొంతకాలంగా షహరాన్పూర్ అల్లర్లతో కల్లోలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు, బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరారు.
మాయావతి వచ్చినప్పుడు కూడా...
ఇంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చినప్పుడు కూడా షహరాన్ పూర్ లో అల్లర్లు మళ్లీ చెలరేగాయి. మాయావతి వెళ్లగానే.. దళితులు, ఠాకూర్ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు రాజకీయ నాయకులను అనుమతించమని యూపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా సరే, ఎలాగైనా అక్కడకు వెళ్లి తీరాలని రాహుల్ గాంధీ శనివారం పట్టుబట్టి మరీ వెళ్లారు. అయితే ఆయన్ని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
20 కిలోమీటర్ల ముందే నిలిపివేత...
షహరాన్ పూర్ సరిహద్దుల వద్దే రాహుల్ గాంధీని పోలీసులు ఆపేశారు. దీంతో నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్డర్ చెక్పోస్టు వద్దే బాధిత కుటుంబాలను కలుస్తానని రాహుల్ చెప్పారు. షహరాన్ పూర్ లోపలకు ప్రవేశించడానికి మూడు మార్గాలున్నాయి. ముజఫర్నగర్, బదోద్-షామ్లి, పానిపట్ యమునా నగర్.. ఈ మూడు మార్గాలను పోలీసులు ముందుగానే దిగ్బంధించారు.
‘అనుమతించమని ముందే చెప్పాం’
నిజానికి షహరాన్ పూర్ లో రాహుల్ పర్యటనకు యూపీ ప్రభుత్వం అంగీకరించ లేదు. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ నాయకులను ఆ ప్రాంతానికి అనుమతించట్లేదని యూపీ శాంతిభద్రతల విభాగపు అదనపు డైరెక్టర్ జనరల్ ఆదిత్య మిశ్రా తెలిపారు. షహరాన్ పూర్ పర్యటనకు వచ్చినప్పుడు మాయావతి రెచ్చగొట్టేలా ప్రసంగించడంతో పరిస్థితి మరింత దిగజారిందని, .ఇప్పుడు రాహుల్ వస్తున్నది కూడా కేవలం ఫొటోలతో హడావుడి చేయడానికేనని, ఈ విషయాన్ని ఇలా రాజకీయం చేయడం తగదని మంత్రి ఆదిత్య మిశ్రా వ్యాఖ్యానించారు. మరోవైపు అనుమతి లభించకపోయినా.. రాహుల్ మొండిగా శనివారం షహరాన్పూర్ బయలుదేరి వెళ్లినా నగరంలోకి మాత్రం ప్రవేశించలేకపోయారు.
తర్వాత విచారిస్తామన్న సుప్రీం...
షహరాన్ పూర్ లో పరిస్థితి ఇప్పటికీ అత్యంత సున్నితంగానే ఉంది. అక్కడ ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన కేసును సిట్ విచారిస్తుండగా, దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా వినేందుకు సుప్రీంకోర్టు సైతం నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత దాన్ని విచారించవచ్చని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం చెప్పింది.