సోనియా పక్కకు: రాహుల్ గాందీ కాంగ్రెస్ బాస్?
న్యూఢిల్లీ: పార్టీ బాధ్యతల నుంచి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పక్కకు తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పజెప్పే విషయమై మంగళవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. రాహుల్ను కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్ పార్టీలో ఓ వైపు పెరుగుతుండగా, మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సైతం రాహుల్ అధ్యక్షుడు కావాలని గట్టిగా భావిస్తున్నట్టు గురువారం చెప్పారు.
తాను ఈ మాట చాలాకాలంగా చెప్తున్నానని, ఆ మాటకే కట్టుబడి ఉంటానని, పార్టీ ఉపాధ్యక్షుడి బాధ్యతలను రాహుల్ సమర్థవంతంగా నిర్వహించాడన్నది తన దృఢ అభిప్రాయమని, అందువల్ల ఏఐసిసి బాధ్యతలను సైతం అప్పగించాలని పార్టీ నాయకత్వాన్ని, సోనియా గాంధీని తాను అభ్యర్థిస్తున్నానని దిగ్విజయ్ అన్నారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి, కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి ఇదే సరైన సమయమని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా దిగ్విజయ్ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ఆగస్టు- సెప్టెంబర్ మధ్యలో కొత్త అధ్యక్షురాలు లేదా అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో ముగుస్తాయి.
అలాగే ఈ ఏడాది మార్చిలో ఏఐసిసి సమావేశం జరగనున్న తరుణంలో దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని దిగ్విజయ్ సింగ్ రెండు నెలల క్రితమే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ జవహర్లాల్ నెహ్రూ 38వ ఏట ఏఐసిసి అధ్యక్షుడయ్యారని కూడా చెప్పారు. అలాగే వౌలా ఆజాద్ సైతం 35 ఏళ్లకే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. రాహుల్ గాంధీ ప్రస్తుత వయసు 44 ఏళ్లు. 68ఏళ్ల సోనియా గాంధీ 1998నుంచీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ గత నెల పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై కాంగ్రెస్ పునరుజ్జీవ పథకంపై కిందిస్థాయి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. ఇది జరిగిన వెంటనే ఈ ప్రక్రియనంతా ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి తనకు నివేదిక సమర్పించాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శులతోపాటు పిసిసి అధ్యక్షులకు లేఖలు రాశారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ 2013 జనవరిలో రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా వచ్చినప్పటినుంచి పార్టీలో ఆయన కార్యకలాపాలు బాగా పెరిగాయి. కిందిస్థాయి కార్యకర్తలనుంచి వచ్చిన సూచనలన్నిటినీ పుస్తకంగా రూపొందించి, ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఏఐసిసి సమావేశంలో చర్చించి ఆమోదిస్తారని తెలుస్తోంది.