మాట్లాడనివ్వరా?: మోడీది అవినీతంటూ రాహుల్ ఉద్వేగం
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు పేరుతో మోడీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మోడీ అవినీతిపై తన దగ్గర పక్కా సమాచారం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే మోడీ తనను మాట్లాడనివ్వడం లేదని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ ఉద్వేగంగా మాట్లాడారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ సమావేశాల తీరుపై విపక్షాలు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాట్లాడారు.
మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని పార్లమెంటుకు జవాబుదారుగా ఉండాలని అన్నారు. మోడీ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు గానీ.. పార్లమెంటులో మాట్లాడరని ధ్వజమెత్తారు. విపక్షాలు చర్చను కోరుకుంటుంటే.. అధికార పక్షం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
'ప్రధాని వ్యక్తిగత అవినీతి సమాచారం నా వద్ద ఉంది. ఆ వివరాలను లోక్సభలో చెప్పాలనుకున్నా. ప్రధాని మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. నేను మాట్లాడితే ప్రధాని ఇబ్బంది పడతారు... అందుకే నన్ను మాట్లాడనివ్వటం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుణ్ని నేను. సభలో మాట్లాడే హక్కు నాకు ఉంది' అని అన్నారు.
అంతేగాక, భలో చర్చ జరగనివ్వకుండా అధికారపక్షమే అడ్డుపడుతోందని ఆరోపించారు. పార్లమెంట్ చరిత్రలో చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డుకోవడం ఇదే తొలిసారని మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.